సమాచారం

30 వ నంబరు ఎవరిది ?

29 వ నంబరు లోకి తెలంగాణా ఇక వచ్చేసినట్లే. తరవాత 30 నంబరుకోసం ఎదురు చూస్తున్న మరికొన్ని పోరాటాలు మేరా నంబర్ కబ్ ఆయేగా అని చూస్తున్నాయి.

అయితే ఇప్పటి వరకూ ఏర్పడిన రాష్ట్రాల వివరాలు ఇవి

సంఖ్య
రాష్ట్రం పేరు
రాజధాని
సంవత్సరం
28
ఛత్తిస్ ఘర్
రాయ్ పూర్
2000
27
జర్ఖండ్
రాంచీ
2000
26
ఉత్తరా ఖండ్
డెహ్రడూన్
2000
25
అస్సాం
డిస్పూర్
1975
24
సిక్కిం
గాంగ్ టక్
1975
23
అరుణా చల్ ప్రదేశ్
ఈటా నగర్
1972
22
మిజోరాం
ఐజ్వాల్
1972
21
హిమాచల్ ప్రదేశ్
సిమ్లా
1971
20
గుజరాత్
గాంధీనగర్
1970
19
మెఘాలయ
షిల్లాంగ్
1970
18
హర్యానా
ఛండీగర్
1966
17
పంజాబ్
ఛండీగర్
1966
16
నాగాలాండ్
కోహిమా
1963
15
గోవా
పానాజి
1961
14
మహారాష్ట్ర
ముంబై
1960
13
ఆంద్రప్రదేశ
హైదరా బాద్
1956
12
కర్ణాటక
బెంగళూరు
1956
11
కేరళ
తిరువనంతపురం
1956
10
మధ్య ప్రదేశ్
భోపాల్
1956
9
త్రిపుర
అగర్తలా
1956
8
జమ్ము&కాశ్మీర్
శ్రీనగర్
1948
7
ఒరిస్సా
భువనేశ్వర్
1948
6
రాజస్థాన్
జైపూర్
1948
5
మనిపూర్
ఇంపాల్
1947
4
పశ్చిమ బెంగాల్
కోల్ కతా
1947
3
ఉత్తర్ ప్రదేశ్
లక్నో
1937
2
బిహార్
పాట్నా
1912
1
తమిళ్ నాడు
చెన్నై
1688

    బోడోలాండ్ : 2003 ఫిబ్రవరి 10 తారీఖున ఏర్పడిన ఒప్పందం ప్రకారం బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ అస్సాంలో ఏర్పడింది. బోడో లిబరేషన్ టైగర్స్ ఫోర్స్ ప్రత్యేక రాష్ట్రం కోసం తమ పోరాటాన్ని చేస్తూనే వుంది.

    దిమరాజి : అస్సాంలో దిమా హసో, కచ్చార్,జిల్లాలతో పాటు దిమాపూర్ లోని నాగోన్ కర్బీ ఆన్ గ్లాండ్ ప్రాంతాలను కూడా కలిపి ఈ రాష్ట్రాన్నీ ఏర్పాటు చెయ్యాలనేది వాది డిమాండ్.

    ఢిల్లీ : దేశ రాజధానిగా తెలిసిన ఢిల్లీలో కూడా ఈ విభజన సెగలున్నాయి. ఇది న్యూఢిల్లీ దాని పరిసరాలలోని ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా, గుర్గావ్,సోనిపాట్, భాగ్పాట్ లతో కలగలసిన మహానగరం. దాదాపు 22 మిలియన్ల నివాసిత జనాభాని కలిగి వుంది. ఒక కేంద్ర పాలిత ప్రాంతం కంటే దాని స్వంత హైకోర్టు, శాసన సభ, ముఖ్యమంత్రి నేత్రుత్వంలో రాష్ట్రంలా ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లి సంయుక్తంగా కేంద్రప్రభుత్వ మరియు ఢిల్లీ స్థానిక ప్రభుత్వ పాలనలో వుంది. 2003 లోనే దీన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని ప్రతిపాదించారు. పౌరపరిపాలనా సౌలభ్యానికి ఇది దోహదం చేస్తుందనే వాదనలు కొనసాగుతున్నాయి.

    గూర్ఖాలాండ్ : గూర్ఖా లనే ప్రజల పేరు మీరుగా ఈ రాష్ట్ర డిమాండ్ ప్రారంభం అయ్యింది. డార్జిలింగ్ కొండలు మరియు పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగంలో డోయర్స్ నివశించే వారు. జాతి, భాష మనో భావాలనే అంశాల ఆధారంగా ప్రత్యేకతను కాపాడుకునే నేపద్యంలో ఈ ఉద్యమం ప్రారంభం అయ్యింది. 1907 నుంచే ప్రత్యేక పరిపాలనా ప్రాంతం కావాలనే డిమాండ్ వుంది.

    హరిత్ ప్రదేశ్ : మీకు హరితాంధ్రపదేశ్ అనే మాట గుర్తొస్తోందా కాదండీ. ఉత్తర ప్రదేశ్ పడమటి భాగంలోని 22 రాష్ట్రాలు ఇప్పుడు ఆరు డివిజన్లుగా వున్నాయి ఆగ్రా, ఆలిఘర్, బారేలీ, మీరట్, మోరాదాబాద్ మరియూ సహారన్ పూర్. ఉత్తర ప్రదేశ్ తూర్పూ పడమర భాగాల మధ్య ఆర్ధికంగా, సాంస్క్రుతికంగా వ్యత్యాసాలున్నాయి. పడమర ప్రాంతం హర్యానా రాజస్థాన్ లతో ఎక్కువగా సంభందాలను కలిగి వుంటుంది. అజిత్ సింగ్ అనే ప్రముఖ న్యాయవాది నాయకత్వం లో ఏర్పడిన రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ హరిత్ ప్రదేశ్ ను డిమాండ్ చేస్తోంది మాయా వతి కూడా దీనికి తన మద్దతు 2009 లో ప్రకటించారు.

    కొంగునాడు : కొంగునాడు అంటే కోయంబత్తూరు, ఈరోడు, సేలం జిల్లాల తావు. ఎంతో పాతదైన తెలుగు పంటవంశపు కుదురు తొండై నాడు ఈశాన్య ప్రాంతానికీ, ఛోళనాడు వాయువ్య ప్రాంతానికి, కర్ణాటకకు ఆగ్నేయ ప్రాంతానికీ, కేరళ తూర్పు భాగానికీ సంభందించినది కొంగునాడు డిమాండ్. కొంగునాడు మున్నేద్ర కజగం(KMK) పార్టీ ఈ డిమాండ్ చేస్తోంది. ఆర్దికంగా తమప్రాంతానికి రాష్ట్ర బడ్జెట్ లో వాటా లభించకుండా అన్యాయం జరుగుతోంది అన్న ప్రాతిపదికపై ఈ ఉద్యమం మొదలయ్యింది. ఇది కూడా పది జిల్లాల డిమాండే. కొయంబత్తూర్, నీలగిరీస్, నమక్కల్, ఈరోడ్, తిరుపూర్, సాలెం, కృష్ణ గిరి, ధర్మపురి మరియూ డిండిగల్ జిల్లాలతో కలసిన కొంగునాడు కావాలని కోరుతున్నారు.
      కోసల : ఇది ఒడిశాలోని ప్రాంతం. సుందర్ ఘర్, ఝార్సుగూడా, సంబర్ పూర్, బార్ ఘర్, సోనేపూర్, భోధ్, బోలాంగిర్, నౌపడా, కాలా హండీ, నవరంగ్ పూర్, అన్ గల్ పూర్ జిల్లాలోని ప్రాంత మైన ఆథ్ మాలిక్, రాయ్ ఘడ్ లోని కాశీపూర్ ప్రాంతం, జార్ఖండ్ కి ఉత్తర భాగంలో వుంటుంది.

    • మిధిల : రామాయణంలో జనకుడు లేదా మిథి పరిపాలించిన విదేహ రాజ్యానికి చెందిన ప్రాచీన రాజధాని నగరము ీహార్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలలో మైధిలి భాష ను మాట్లాడే 24 జిల్లాలను కలిపి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలని డిమాండ్. 1993లో అంతరాష్ట్రీయ మిథిలా పరిషద్ పేరుతో మొట్టమొదటి సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ తన తాను మిథిల మరియు మైథిలి కొరకే ఏర్పాటు చేయబడ్డట్లు ప్రకటించింది. తరువాత 1995లో ఏర్పాటైన మిథిలా రాజ్య సంఘర్ష్ సమితి , 2008లో మరియు అఖిల భారతీయ మిథిలా పార్టీ, మిథిలా వికాస్ పార్టీ , లాంటి మరికొన్ని సంస్థల ఏర్పాటు జరిగింది. ఈ రెండు రాజకీయ పార్టీలు మిథిలా రాష్ట్ర ఏర్పాటు ప్రస్థావనతో తమ అస్థిత్వం నిలుపుకుంటున్నాయి.

      పూర్వాంచల్ : ఉత్తర ప్రదేశ్ లోని తూర్పుకోస ప్రాంతం. దీని సరిహద్దులలో ఉత్తరాన నేపాల్, తూర్పున బీహార్ రాష్ట్రం, ధక్షిణాన మద్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతం, పడమటన ఉత్తర్ ప్రదేశ్ లోని అవధ్ ప్రాంతం వస్తాయి. దీనిలో అవధ్ ప్రాంతం, బోజ్ పురి,బుందేల్ ఖండ్ వున్నాయి. ఇక్కడ ఎక్కువగా మాట్లాడుకునే భాష బోజ్ పురి. ప్రముఖ రాజకీయవేత్త అమర్ సింగ్ నేత్రుత్వంలో ఈ ఉద్యమం నడుస్తోంది. పూర్వాం చల్‌ కూడా రాష్ట్రంలో బుందేల్‌ఖండ్‌ మాదిరే బాగా వెనకబడిన ప్రాంతం. కానీ, బుందే ల్‌ఖండ్‌తో పోలి స్తే పూర్వాంచల్‌లో జనసాంద్రత ఎక్కువ. ఇక్కడ పట్ట ణాలు తక్కువ. ఏవో కొన్ని పరిశ్రమలున్నాయి. అసలే వెనకబడిన ప్రాంతం… దానికితోడు ఇక్కడ ప్రతి సంవత్సర మూ వరదలు బీభత్సం సృష్టిస్తుంటాయి. సంపన్నులు చాలా తక్కువ. చాలా చోట్ల పేదరికం తాండవిస్తూంటుంది. ఉత్తరప్రదేశ్‌లో పూర్వాంచల్‌ గోరఖ్‌పూర్‌ నుంచి అలహాబాద్‌ వరకు, బాలియా- డియోరియా నుం చి వారణాసి- ఆజంగఢ్‌ వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు 28 మంది ఎన్నికవుతారు. 403 మంది సభ్యులున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో 150 మంది ఇక్కడి నుంచే వచ్చారు.

    • తుళునాడు : భారతదేశంలోని కర్నాటక, కేరళ రాష్ట్రాలలో తుళు భాష మాట్లాడే ప్రాంతాన్ని తుళునాడుగా వ్యవహరిస్తారు. దీనిలో కర్నాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలూ కేరళలోని కాసరగోడు జిల్లాలో పాయాశ్విని నది వరకూ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. మంగళూరు, ఉడిపి, కాసరగోడు ఈ ప్రాంతాలలోని పెద్ద ఊర్లు.స్వాతంత్ర్యానంతరం, రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడినపుడు తుళు భాషీయులు తమ భాషకి అధికార భాష గుర్తింపుకోసం, ప్రత్యేక భాషాప్రయుక్త రాష్ట్రన్ని ఏర్పరుచుకోడానికి ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో, తుళునాడు రాష్ట్ర డిమాండు కూడా మళ్ళీ బయటకి వస్తోంది. తుళు రాజ్య హోరాట సమితి వంటి సంఘాలు ఇందుకోసం సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
      Vidarbha (Marathi: विदर्भ) is a region that comprises the Amravati and Nagpur divisions of eastern Maharashtra. The State Reorganization Act of 1956 placed Vidarbha in Bombay State. Shortly after this, the state reorganisation commission recommended the creation of “Vidarbha state” with Nagpur as the capital, but instead it was included in Maharashtra state, which was formed on 1 May 1960.
      Support for a separate state of Vidarbha had been expressed by Loknayak Bapuji Aney and Brijlal Biyani Vidarbha. The demand for the creation of a separate state are based on allegations of neglect by the Maharashtra state government. Jambuwantrao Dhote led a popular struggle for Vidarbha statehood in the 1970s. Two politicians, N.K.P. Salve and Vasant Sathe, have led 21st century attempts to bring about a state of Vidarbha.

      విధర్భ :

    అయినీ-అక్బరీ ప్రకారం మధ్యయుగ కాలంలో ఖిల్జీ వంశం నుండి మొగలుల పరిపాలన దాకా, సుబః బేరార్, గొంద్వాన మరియు గుల్షన్-ఎ-బేరార్ గా పిలువబడిన విదర్భ ప్రాతం యొక్క దేవఘర్ సర్కార్ కు నాగపూర్ ముఖ్యపట్టణంగా ఉండేది మరియు ఆలంగీర్ నామా ప్రకారం విదర్భ ప్రాంతపు పద్నాలుగు సర్కారులను బేరార్ అంటారునాగపూర్ డివిజన్ మరియు అమరావతి డివిజన్‌లతో ఏర్పడిన మహారాష్ట్ర యొక్క తూర్పు ప్రాంతం. ఇది మహారాష్ట్ర యొక్క మొత్తం ప్రాంతంలో 31.6% ఆక్రమించి మొత్తం జనాభాలో 21.3% కలిగిఉంది[1]. ఇది ఉత్తరాన మధ్య ప్రదేశ్, తూర్పున ఛత్తీస్‌గడ్, దక్షిణాన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను మరియు పశ్చిమాన మాహారాష్ట్రలోని మరాఠ్వాడ మరియు ఖాందేష్ ప్రాంతాలను సరిహద్దులుగా కలిగిఉంది. మధ్య భారతదేశంలోని విదర్భ, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు భిన్నమైన తన స్వంత ఘనమైన సాంస్కృతిక మరియు చారిత్రక నేపధ్యాన్ని కలిగిఉంది. నాగపూర్ విదర్భ యొక్క అత్యంత పెద్ద నగరం, రెండవ పెద్ద నగరం అమరావతి, తరువాత స్థానంలో అకోలా, యవత్‌మల్, చంద్రపూర్ మరియు గోండియా ఉన్నాయి. అధికభాగం విదర్భవాసులు మరాఠీ మాండలికమైన వర్హది మాట్లాడుతారు.విదర్భ జాతీయ స్థాయిలో 10 లోక్‌సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. విదర్భ రాష్ట్రస్థాయిలో 62 విధానసభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. భారత ప్రభుత్వ జనాభా లెక్కలు 2001 ప్రకారం విదర్భ 20,630,987 జనాభాను కలిగిఉంది.

    ప్రత్యేక రాష్ట్రవాద ఉద్యమం

    1) 1853 :-మొగలులు మరియు మరాఠాల నుండి మధ్య భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించిన తరువాత, 1853లో నాగపూర్ రాజధానిగా “నాగపూర్ ప్రావిన్స్” ఏర్పాటుచేయబడింది. ఇది కేంద్ర ప్రభుత్వం నియమించే ఒక కమిషనర్ పాలనలో ఉండేది.

    2) 1861 :- నాగపూర్ రాజధానిగా బ్రిటిష్ వారు “సెంట్రల్ ప్రావిన్స్“ను ఏర్పరచారు.

    3) 1903 :- అక్టోబర్ 1 న బేరార్ కూడా సెంట్రల్ ప్రావిన్స్‌ల కమిషనర్ పాలనలోకి వచ్చింది. దీనికి ఇప్పుడు “సెంట్రల్ ప్రావిన్స్ అండ్ బేరార్” అని పేరు పెట్టబడింది.

    4) 1935 :- బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన భారత ప్రభుత్వ చట్టం, ఎన్నికలను నిర్వహించి, ప్రొవిన్షియల్ అసెంబ్లీని ఏర్పరచింది. నాగపూర్ రాజధానిగా “సెంట్రల్ ప్రావిన్స్ మరియు బేరార్” ప్రత్యేక రాష్ట్రంగా ఉంచబడింది.

    5) 1950 :-1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు “సెంట్రల్ ప్రావిన్స్ మరియు బేరార్”, నాగపూర్ రాజధానిగా మధ్య ప్రదేశ్‌గా ఏర్పడ్డాయి.

    6) 1956 :-భారతదేశంలో రాష్ట్రాల పునర్విభజన కొరకు ఏర్పాటైన ఫజల్ అలి కమిషన్(1953లో నియమించబడింది) నాగపూర్ రాజధానిగా “విదర్భ రాష్ట్రం” కొరకు సిఫారసు చేసింది.

    7) 1960 :- మే 1న, రాష్ట్రాల పునర్విభజన కొరకు ఫజల్ అలీ కమిషన్‌చే సిఫారసు చేయబడిన “విదర్భ రాష్ట్రం”, నూతనంగా ఏర్పాటైన మహారాష్ట్ర రాష్ట్రంతో కలిపివేయబడింది.

    మహారాష్ట్ర యొక్క మిగిలిన ప్రాంతంతో సాంస్కృతిక భిన్నత్వంతో పాటు, విదర్భ చారిత్రకంగా ఒక ప్రత్యేక శైలిలో రూపొందింది. అనేక లేఖనాల ప్రకారం విదర్భ ప్రాంతంలో ఇవి జరిగాయి:

    అగస్త్యుడు మరియు లోపాముద్రల వివాహం.
    కృష్ణునిచే రుక్మిణీ-హరణం (రుక్మిణిని ఎత్తుకుపోవడం). రుక్మిణి, విదర్భ దేశపు రాకుమార్తెగా వర్ణించబడింది. రుక్మిణి కృష్ణుని ముఖ్య రాణులలో ఒకరిగా మారింది.
    పౌరాణికంగా మహాభారతంలో కుండిన్ పూర్/కౌండిన్య పూర్/కుండినపురి, విదర్భ యొక్క ముఖ్యపట్టణంగా చెప్పబడింది. బమ్మెర పోతన (భాగవతం నుండి)

    వచ్చెద విదర్భ భూమికి
    చొచ్చెద భీష్మకుని పురము సురుచిర లీలన్
    తెచ్చెద బాలన్ వ్రేల్మిడి
    వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చిన పోరన్!

    అనే పద్యం శ్రీకృష్ణ పాండవీయం (1966) తెలుగు సినిమానుంచి ఘంటసాల పాడారు. యన్ టీ ఆర్ కృష్ణపాత్రధారి టివి రాజు సంగీతం.

    నల మహారాజు మరియు దమయంతిల కధ కూడా మహాభారతంలో ఉంది.

    రామాయణంలో కూడా విదర్భ ఆ సమయంలోని జనపదములలో ఒకటిగా పేర్కొనబడింది.

    కాళిదాసు యొక్క పద్యకావ్యం “మేఘదూత” కూడా యక్ష గాంధర్వ దేశబహిష్కారప్రదేశంగా విదర్భను సూచిస్తుంది.


      ఇంకా ఈ క్రింది రాష్ట్రాలు కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ లోవున్నాయి వాటి వివరాలు కొంత విరామం తర్వాత అందజేయగలను అప్పటివరకూ సెలవు.
      (చూస్తూనే వుండండి కుదిరి నప్పుడల్లా నాబ్లాగ్…. 🙂  )



    మరికొన్ని లింకులు

    మందిని కలిపి ఉంచేది నుడే
    – స.వెం. రమేశ్

    Standard
    telugu poetry

    కురుస్తున్న చినుకు

    కురిసే ఈ చినుకంటే కొందరికి కినుక,మరికొందరి ఆనందానికి ఊనిక,

    అరచేతిని అడ్డుపెట్టి వర్షాన్ని ఆపలేరు,తడి తగలకుండా చూసుకో గలరేమో గానీ

    కురిసే ఈ చినుకుపొలానికి మళ్ళాళి తిండిగింజగా అయ్యేందుకు

    మనసు ముత్యపు చిప్పలో పడాలి,సంతోషాన్ని పూయించేందుకు.

    ఎండిన పెదాల దాహం తీర్చేందుకు,ఆగిన పాదాల నడకను కూర్చేందుకు,

    మురికి కాల్వలతో నిండిన చోటునిముందు శుబ్రం చేసుకుందాం పట్టండి.

    ఏరువాక సాగేందుకువిత్తనాలను సగెయ్యండి.

    చినుకులానే ప్రేమను కురిపించేందుకువిజయానికి హృదయం అద్దండి.

    Standard
    వివరణ

    పంచభక్ష్యములంటే ఏమిటి ? ఏవి?

    భక్ష్యము అంటే తినదగినది ఎడిబుల్ అని కదా అర్ధం అందులో ఐదు రకాలున్నాయట వాటిని పంచభక్ష్యాలంటారు.

    పంచభక్ష్యములు అంటే భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయం.

    భక్ష్యం అన్నా భోజ్యం అన్నా “తినదగినది” [”ఎడిబుల్‌”] అనే నిఘంటుకారుడు చెప్పేడు. కానీ ఈ రెండింటి మధ్య తేడా చాలా స్వల్పంగా వుంటుంది.

    భక్ష్యం అంటే కొరికి తినేది(గారె, అప్పము వంటివి),

    భోజ్యం అంటే కొరకకుండా నమలి మింగేది (పులిహోర, దధ్యోదనం వంటివి)అని అర్ధం చేసుకోవచ్చు,

    లేహ్యం అంటే నాకి(lick) భుజింపఁదగిన వ్యంజనవిశేషము.కల్కద్రవ్యములుచేర్చి ముద్దగా చేసిన మందులను సాధారణంగా ఆయుర్వేద దుకాణాలలో లభించే తేనె వంటి పదార్ధాలను లేహ్యాలుగానే పిలుస్తుంటాం. లేహ్యం వాడుతున్నాం అని వాడుకలో కూడా ఉపయోగిస్తుంటారు. తమిళంలో లేగియమ్ అని మరున్దు అని దీన్ని పిలుస్తారు. కన్నడంలో కూడా లేహ్యం అనే అంటారు నెక్కువ ఔషది అని మరో పేరు. food or medicine that is licked or sipped, an electuary, syrup, lambative.

    చోష్యం అంటే పీల్చదగ్గది లేదా జుర్రుకోడానికి వీలైనది.

    పానీయం అంటే Drinkable. త్రాగదగినది అని అర్ధం పానము నుంచి ఉత్పన్నమైన పదం ఇది. కన్నడం లో పానకవు అని తమిళంలో కుడినీర్ అని వాడతారు.

    ఆహారాన్ని తిన్నామా కడుపునింపుకున్నామా అన్న పద్దతిలో కాకుండా వండటం నుంచి వడ్డించటం వరకూ కొన్ని శాస్త్రీయ ప్రాతిపదికలను ఏర్పరచారు. కుంతకాలు, రదనికలూ, అగ్రచర్వణకాలు, చర్వణకాలు అనే నాలుగు రకాల దంతాలతో మిశ్రమ ఆహారాన్ని తీసుకోగలిగేందుకు అనుకూలమైన దంతవిన్యాసమూ, నోటి కుహరపు అమరిక కలిగివున్న మానవునికి శక్తినిచ్చేందుకు మాత్రమే కాకుండా రుచికూడా కలిసి తృప్తిని అందిచాలని, ఆయుర్వేదశాస్త్రాన్ని మేళవించి కలగలపిన ఆహార దినుసులతో తెలియకుండానే ఆరోగ్య సంరక్షణ చేసుకునేలా ఆహార చట్రాన్ని రూపోందించారు. వీటి విశేషాలను లోతుగా పరిశీలించినపుడు కొంత ఆశ్చర్యం కలగక మానదు. అంతే కాదు ఏ పదార్ధాన్ని ఎటువంటి వాటిలో వడ్డించాలి. తినే వారి చేతికి ఏ దిశగా వడ్డించాలి. ఎంత మేర వడ్డించాలి. తినే పద్దార్దాన్ని బట్టి వాటి క్రమం ఎలా వుండాలి. లాంటి నియమాల వెనుక ఏదో ఒకరకంగా ఏర్పడటం కాక తార్కికమైన, అర్ధవంతమైన క్రమం వుండటం గొప్పవిషయం.

    నిజానికి వీటిని ఒక్కక్కటిగా పరిశీలిస్తూ ఆధునికి కేటరింగ్ బేసిక్ నిభందనలు ఏమిచేపుతున్నాయి. వైద్య శాస్త్రం, పోషణాధారిత గ్రంధాలు ఏం చెపుతున్నాయి అనే అంశాలను పరిశీలించుకుంటూ వెళితే అదో ప్రత్యేకాశం అయ్యేలా వుంది. దీనిపై మరిన్ని వివరాలు తెలిసిన మిత్రులు స్పందిస్తే మరింత ఉపయోగకరంగా వుంటుందని భావిస్తున్నాను.

    ఫేస్ బుక్ లో

    Standard
    ఆటవెలది, ప్రక్రియ

    ఆటవెలది

    చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
    బంగరు మొల త్రాడు పట్టుదట్టి
    సందె దాయతులును సరిమువ్వ గజ్జెలు
    చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు !

    చిన్నప్పుడు బహుశా రెండవ తరగతి తెలుగు పుస్తకంలో కావచ్చు ఈ పద్యం మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను. ఆ పేజీలో ఒక నెమలీక కూడా దాచి దానికి తాటి లేత ఆకుల చివరి రెల్లును మేతగా వేసి, ఈ ఇంక ఇంకా పెరుగుతుందని సంతోష పడటం గుర్తుంది.

    తర్వాత మరికొన్ని విషయాలు ఇదే పద్యం గురించి తెలిసాయి. దీని రచయిత పదకవితా పితామహుడు,  “సంకీరత్నాచార్యుడు”, “పంచమాగమ సార్వభౌముడు”, “ద్రవిడాగమ సార్వభౌముడు” తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు) అయిన తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 – ఫిబ్రవరి 23, 1503), వారట, నిజానికి ‘‘ చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు’’ మకుటం తో ఆయన ఒక శతకాన్ని రాసారని చెపుతారు.చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు – ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడని చెపుతారు.  సారస్వతం మీద మనకున్న శ్రద్దలేని తనానికి నిదర్శనంగా ఆయన రాసిన అమూల్యమైన రచనలనెన్నింటినో కొల్పోయాం అందులో ఇదికూడా ఒకటి. 


    ఇక ఈ వర్ణనను ఆధారంగా చేసుకుని అప్పట్లో పిల్లలకు చేసే వస్త్ర దారణగురించి, దాని వెనకున్న సాంస్క్రుతిక నేపద్యం గురించి ఒక అంచనాకు రావచ్చు అది మరోక కోణం. మనకు వెండి మొలతాళ్ళు కొంతవరకూ తెలుసు స్థితిమంతులు బంగారు మొలతాళ్ళు పట్టు దట్టీ తొడిగారట.( దట్టీ = 
    A sash, belt, girdle, cestus round the waist. నడికట్టు, కాసెకోక, నడుముకు కట్టుకునే వస్త్రము. ) తాయతులు తెలుసు మరి సందె తాయతులు అనే విశేషమేమిటో అవి కట్టారట, మువ్వలతో అదిన్నూ సరి మువ్వలతో ఘల్లు ఘల్లున మోగే గజ్జలు కట్టారట అటువంటి చిన్నరి కృష్ణుడిని కొలుస్తాను అని చెపుతున్నారీయన.

    ఇక పోతే పద్య చందస్సు ఆట వెలది, జాతి పద్యరీతికి పెట్టుకున్న పేరు ఇదయినప్పటికీ మరో అర్ధంలో  ఆటవెలది అంటే స్త్రీ అని నర్తకి,వెలపడతి,దేవదాసి,ఆటకత్తె, వేశ్య మొదలైన అర్ధాలుకూడా వున్నాయి. ఎందుకలా పేరు పెట్టారో కానీ పద్యం మాత్రం అందమైనది. 


    ఆటవెలది కున్న ఈ నానార్ధాన్ని దృష్టిలోపెట్టుకునే ఒక చమత్కారం చెపుతుంటారు. సీస పద్యం తర్వాత ఆటవెలది కానీ తేట గీతి కానీ తప్పని సరిగా చెప్పాలంటారు అందుకే సరసులు దీనిని వ్యవహారికంగా అన్వయం చేసి ‘‘ సీసా తర్వాత ఆటవెలది వుండాలోయ్’’ అని అంటుంటారు.

     ఆటవెలది చందస్సుని విస్త్రుతంగా వాడుకుని సామాజిక దోషాలను కడిగి పారేసిన వాడు మన వేమన. అందుకేనేమో హైదరాబాద్ ట్యాంకుబండు పైనున్న వేమన విగ్రహం క్రింద ఆయన పరిచయ వాక్యాలను ఈ విధంగా రాసారు. ఆటవెలది ని ఈటె గా విసరిన దిట్ట. చాందస భావాలకు తొలి అడ్డు కట్ట.” ఆయన ఆటవెలది లో దిట్ట. సూటిగా సరళంగా ఆయన రాసినటు వంటి వాటిని పోలిన  ఆటవెలదులు మనం ఎ గ్రంధం లోనూ చూచి ఉండము బహుశా చూడలేమేమో కూడా. ‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఇదే ఆటవెలది చందస్సును ఉపయోగించి రాసినవే.

    చంధస్సు ఎలా వుంటుందో చూద్దామా.

    ఆటవెలది ఎలా వుంటుందో ఆటవెలది లోనే చెప్పాలంటే ఇలావుంటుందని సూత్రాన్ని చమత్కార సహితంగా చెప్పారు.
    ఆ. ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబును
    హంస పంచకంబు ఆటవెలది.


    • ఇందు నాలుగు పాదములుంటాయి.
    • 1, 3 పాదాలు మెదట 3 సూర్య గణాలు తరువాత 2 ఇంద్ర గణాలు కలిగి ఉంటాయి.
    • 2,4 పాదాలు 5 సూర్య గణాలు ఉంటాయి.
    • ప్రతి పాదములొ నాల్గవ గణం మొదటి అక్షరం యతి
    • ప్రాసయతి చెల్లును
    • ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లును.
      పాదమందలి మొదటి అక్షరమునకు, యతి మైత్రి స్థానములోనున్న అక్షరమునకు యతి కుదుర్చుటకు బదులు, పాదమందలి రెండవ అక్షరమునకును, యతి మైత్రి స్థానము తరువాతి అక్షరమునకు ప్రాస కుదుర్చుటను ప్రాసయతి అందురు. 
    • ఉదాహరణకు  “వేడి గిన్నె చురక వాడిగా తగలగా” అన్నపాదంలో, “వే”కి “వా”కు యతి కుదరదు. కానీ, “వేడి”కి “వాడి”కి “ప్రాసయతి” కుదురుతుంది.

    ఆటవెలది ఒక విధముగా చూస్తే అర్ధసమ వృత్తమువంటిది.  సరిపాదాలు ఒక విధముగా, బేసి పాదాలు మఱొక విధముగా  ఉంటుంది.  ఆటవెలది, తేటగీతి లాటి పద్యాలను అంశగణాలతో రాయాలి. (గణాలు మూడు విధాలు – అక్షర గణాలు, మాత్రా గణాలు, అంశ లేక ఉప గణాలు ) 

    కొన్ని ఉదాహరణలు

    1. వార్తయందె జగము వర్తిల్లుచున్నది
    యదియు లేని నాఁడ యఖిల జనులు 
    నంధకారమగ్ను లగుదురు గావున 
    వార్త నిర్వహింపవలయుఁ బతికి.

    (ప్రపంచం వార్త మీదే నడుస్తున్నది. అది లేకుంటే ప్రజలు అంధకారంలో మునిగినట్లే. కాబట్టి ప్రభువు వార్తను బాగా నడపాలి.)

    2. నెఱి నసత్య మనెడి నీడతో వెలుగుచు

    నుండు నెక్కటికి మహోత్తరునకు

    నిఖిల కారణునకు, నిష్కారణునకు న

    మస్కరింతు నన్ను మనుచు కొఱకు.

    3. అనువుగానిచోట అధికులమనరాదు

    కొంచెముండుటెల్ల కొదువగాదు

    కొండ అద్దమందు కొంచెమై యుండదా

    విశ్వదాభిరామ వినురవేమ.

    4. నెఱి నసత్య మనెడి నీడతో వెలుగుచు
    నుండు నెక్కటికి మహోత్తరునకు
    నిఖిల కారణునకు, నిష్కారణునకు న
    మస్కరింతు నన్ను మనుచు కొఱకు.

    Standard
    Telugu

    భారతి : ఐఐటి ఫ్రొఫెసర్ రూపోందించిన సరికొత్త భారతీయ భాష

    మన దేశంలో మాట్లాడే భాషలు 1600.. అధికార భాషలు 22.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష. కనీసం ఊర్ల పేర్లు తెలుసుకోవడానికి కూడా వీల్లేకుండా ఆయా ప్రాంతీయ భాషా లిపుల్లో లిఖించి వుంటే కొత్తగా వెళ్లిన వారు పడే గందరగోళం అంతాయింతా కాదు. దీని నుంచి గట్టెక్కేందుకే మద్రాస్ ఐఐటీ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ వడ్డాది శ్రీనివాస చక్రవర్తి ‘భారతి’ పేరుతో సరికొత్త లిపిని కనుక్కున్నారు. ఎందరి సమస్యకో పరిష్కార మార్గం కోసం ప్రయత్నించిన ఆయన మన ఆం«ద్రుడే. ‘భారతి లిపి వల్ల కలిగే లాభాలేంటి? ఇందులోని సాధ్యాసాధ్యాలేంటి? దీని అమలు వల్ల కలిగే నష్టాలేంటి?’ వంటి అనేక ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలే ఈ ముఖాముఖి..
    – మీ గురించి చెప్పండి?
    మాది విశాఖపట్టణం. అమ్మ వడ్డాది శేషమ్మ, నాన్న రమణారావు. నాన్న ప్రభుత్వ వైద్యుడిగా పని చేసి రిటైరయ్యారు. మేమిద్దరం పిల్లలం. తమ్ముడు శైలేంద్ర కూడా డాక్టరే. నాన్న వైద్య రీత్యా పలు ఊళ్లు తిరగాల్సి రావడంతో నా ప్రాథమిక విద్య కూడా ఆయనతో పాటు ఊళ్లు తిరిగింది. 10వ తరగతి, ఇంటర్మీడియేట్ విజయవాడలో పూర్తి చేశాను. మద్రాస్ ఐఐటీలో బీ.టెక్ చేసి, యూఎస్‌లో ‘న్యూరల్ నెట్‌వర్క్స్’ అనే అంశంపై పీహెచ్‌డీ చేశాను. అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసి, తరువాత 2000లో మద్రాస్ ఐఐటీకి వచ్చాను. బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాను. నా శ్రీమతి ఇందిర చిన్నపిల్లల వైద్యురాలు. ఇక్కడే స్వంతంగా క్లినిక్ నడుపుతోంది. నా ఏకైక కుమార్తె ద్యుతి పదవ తరగతి చదువుతోంది.
    -మీ వంశంలో ఎవరైనా భాషా పండితులు గానీ, సాహితీవేత్తలు గానీ వున్నారా?
    ఎవ్వరూ లేరు. మా తాతయ్య కూడా ఆర్ఎంపీ డాక్టరే.
    -‘భారతి’ లిపి రూపొందించాలన్న ఆలోచన ఎందుకొచ్చింది?
    భారతీయ భాషలను కంప్యూటర్‌లో టైప్ చేయడం కష్టం. అదే ఇంగ్లీష్ అయితే చాలా సులభం. అందుకే తమిళం, మలయాళం, తెలుగు తదితర భాషల్ని కంప్యూటర్‌లో సంక్షిప్తం చేస్తున్నాం. ఆంగ్లంలో వున్న 26 అక్షరాలను తెలుగులో 10 వేల అక్షరాలుగా రాయవచ్చు. జె.ఫాకేసన్ అనే వ్యక్తి ఆంగ్ల అక్షరాలను కూడా సంక్షిప్తం చేశాడు. అంటే ఆంగ్ల ‘ఎ’ అక్షరానికి మధ్యలో అడ్డగీత అవసరం లేదని చెప్పాడు. అలా ఆంగ్ల అక్షరాల్లో చాలా వాటిని రూపొందించాడు. దానికి ‘గ్రాఫిటియన్’ అని పేరు. అదే నాకు స్ఫూర్తి.
    దేశం మొత్తమ్మీద 1600 భాషలు మాట్లాడుతున్నట్లు అంచనా. మన దేశంలో 22 అధికార భాషలున్నాయి. దేశంలోని వివిధ పాఠశాలలన్నీ కలిపి 58 రకాల భాషల్ని బోధిస్తున్నాయి. 87 భాషల్లో దినపత్రికలు వెలువడుతున్నాయి. అయితే ఉర్దూతో కలిపి పదింటిని ప్రధాన లిపులుగా గుర్తించడం జరిగింది. అయితే ఉర్దూ శైలి వేరు. మిగిలిన తొమ్మిది భాషల్లో అ-ఆ, ఇ-ఈ వంటివన్నీ వుంటాయి. మన భాషలకు తర్కబద్ధమైన విశ్వాసం వుంది. తెలుగులో అచ్చులు ముందు, హల్లులు తరువాత వుంటాయి. కానీ ఆంగ్లంలో అలా కాదు. ‘ఎ’ ఎందుకు ముందు వుంటుందో, ‘జడ్’ చివరన ఎందుకుండాల్సి వచ్చిందో ఎవ్వరూ చెప్పలేరు.
    ఇక అ-ఆ, ఇ-ఈ వంటి అక్షరాలను చూస్తే దీర్ఘంతో కూడుకున్న ఒకే అక్షరమని ఎవ్వరూ చెప్పలేరు. అందువల్ల వాటిని నేర్చుకోవడం కష్టం. అదే ‘అ’ మీద ఏదో ఒక అక్షరం చేరిస్తే ‘ఆ’ వచ్చేలా వుందనుకోండి, అది నేర్చుకోవడం సులభం. అలాగే గుణింతంలో కూడా. ఉదాహరణకు క గుణితం తీసుకుందాం. క, కా, కి. కీ… అక్షరాలున్నాయనుకుందాం. క అక్షరానికి పైనో, పక్కనో ఒక చుక్క, లేదా ఒక గీత పెడితే దీర్ఘం వచ్చిందనుకోండి. అది నేర్చుకోవడం సులభం, గుర్తు పట్టడమూ సులభమే అవుతుంది. అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ‘భారతి’ లిపిని రూపొందించడం జరిగింది.
    – ఈ లిపిని ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు?
    నిజం చెప్పాలంటే ‘భారతి’ లిపిని అరగంటలో నేర్చుకోవచ్చు.
    – ఈ లిపిని భారత్‌లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏమిటి?
    ముందే చెప్పినట్లు మన దేశంలో ఎన్నో భాషలున్నాయి, ఎన్నో లిపులు వున్నాయి. వీటన్నింటినీ నేర్చుకోవడం చాలా కష్టం. ఒకరు రాసేది మరొకరికి అర్థం కాదు. అందుకే కామన్ లిపి అనేది చాలా ముఖ్యం. అది వుంటే ఎవ్వరికీ కష్టముండదు. ఉదాహరణకు రైల్వేను తీసుకుందాం. రైళ్లపై హిందీ, ఇంగ్లీషు, ఏదో ఒక ప్రాంతీయ భాషతో కలిపి మొత్తం మూడు భాషల్లో రాస్తారు. అదే భారతిని ప్రవేశపెడితే, దేశమంతా, ఆంగ్లంతో పాటు రెండు భాషలే రాయవచ్చు. ఇది అందరికీ అర్థమవుతుంది. అంటే పని సులభం. డబ్బు ఖర్చు తక్కువ.
    – కానీ మీరు రూపొందించిన ‘భారతి’ లిపిని ప్రవేశపెడితే దేశంలో వున్న లిపులు కనుమరుగైపోతాయి కదా?
    లేదే! ఎలా…
    – భారతి లిపిని దేశవ్యాప్తం చేస్తే, దానితో పాటు ఆంగ్ల భాష కూడా వుంటే, ఇక ప్రాంతీయ భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది?
    భాష వేరు, లిపి వేరు. భావాన్ని వ్యక్తీకరించేది భాష. దానిని రూపంలో పెట్టేది లిపి. అలాంటప్పుడు ప్రాంతీయ లిపులు దెబ్బతినే అవకాశం లేదు.
    – మనం మాట్లాడే భాషను లిఖితరూపం చేయాల్సిన అవసరం లేనప్పుడు ఎవ్వరైనా ఆ భాషను ఎలా నేర్చుకుంటారు?
    రాయాల్సిన అవసరం లేనప్పుడు, ఆ భాషను నేర్చుకోవాల్సిన అవసరమేముందని ఈ స్పీడ్ యుగపు సగటు మానవుడు ఆలోచిస్తాడు నిజమే. ఇప్పటికిప్పుడు కాకపోయినా, కొన్ని తరాల తరువాత అయినా మన పూర్వీకుల నుంచి వచ్చిన భాషల లిపి కనుమరుగు కాక తప్పదు కదా! అయితే మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం వుండవచ్చు. కానీ లిపి కన్నా భాష ముఖ్యమని నేను భావిస్తాను. మీరు లిపి గురించి ఆలోచిస్తున్నారు తప్ప, ప్రాంతీయ భాషలకు ముంచుకొస్తున్న ముప్పును గురించి ఆలోచించడం లేదు. ఇప్పటికే అన్ని ప్రభుత్వాలు ఆంగ్ల మాధ్యమాన్ని జనంపై ప్రవేశపెడుతున్నాయి. జనం కూడా మాతృభాషల్ని వదిలేసి ఆంగ్లంవైపు పరుగులు పెడుతున్నారు. తమ మాతృభాష మాధ్యమంలో చదివేవారే కరువైపోతున్నారు. దాని వల్లా ముప్పే కదా. అదే కామన్ లిపి భారతిని ప్రవేశపెడితే ఈ నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చు. భాషలో సంస్కరణలు అవసరం. లిపి పెద్ద సమస్య కాదు. లిపి కన్నా భాష ముఖ్యమని నా ఉద్దేశం.
    – దీనికి ‘భారతి’ అని పేరెందుకు పెట్టారు?
    భారతదేశానికి చెందినది కాబట్టి, భారతదేశంలో వినియోగానికి అనువుగా వుండేలా రూపొందించినది కాబట్టి దీనికి ‘భారతి’ అని పేరు పెట్టాను.
    – ఈ లిపిని రూపొందించడానికి ఎన్నాళ్లు పట్టింది?
    నా ఉద్యోగ నిర్వహణలో భాగంగా వేరే ప్రాజెక్టు కోసం పని ప్రారంభించినప్పుడు తలెత్తిన సమస్యలే, ఈ సరికొత్త లిపి రూపకల్పనకు ఊపిరి పోశాయి. దాంతో తొమ్మిది ప్రధాన భాషల్లోని అక్షరాలను స్టడీ చేశాను. అన్ని భాషల వారు సులభంగా నేర్చుకునేందుకు అనువుగా దీనిని రూపొందించాను. ప్రస్తుతం ఈ లిపి చేతితో రాసేందుకు అనువుగా వుంది. కంప్యూటర్‌లో ఫాంట్ రూపకల్పన కోసం ప్రయత్నిస్తున్నాం.
    – ఒక్కో రాష్ట్రానికి ఒక్కో భాష వుంది. ఆయా భాషల అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా తమిళులకు తమ భాష అంటే వీరాభిమానం. అలాంటప్పుడు మీరు రూపొందించిన ‘భారతి’ పట్ల వ్యతిరేకత రాదా?
    వస్తోంది. ఇప్పటికే ఈ విషయం తెలిసి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రాచీన దేవనాగర లిపి వాడితే సరిపోతుంది, మళ్లీ కొత్త లిపి ఎందుకంటూ ప్రశ్నలు సంధిస్తూనే వున్నారు. ప్రధానమైన తొమ్మిది భాషల్లో ఒక్కో దానిలో ఒక్కో అక్షరం లేదు. కానీ నేను రూపొందించిన భాషలో అవసరమైన అన్ని అక్షరాలను వాడాను. అవసరం లేని వాటిని తీసేశాను. ఈ భాష వద్దని రాజకీయ నేతలనుకుంటే నేనేం చేయలేను. మంచి కోసమే దీనిని రూపొందించాను. అమలు చేయాల్సింది నేతలే కదా!
    – భారతిలో ఎన్ని అక్షరాలున్నాయి?
    తెలుగులో వున్నన్ని అక్షరాలే భారతిలోనూ వున్నాయి. గతంలో అచ్చులో ‘లు’, ‘లూ’ వాడేవారు. ఇప్పుడు ఎలాగూ వాడడం లేదు. భారతిలో వాటిని తొలగించాను. అదే విధంగా ఙ, ఞ, క్ష లను కూడా తీసేశాను. భారతిలో వాటి అవసరం లేదు.
    -ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ వుంది?
    ఐఐటీ మద్రాస్ లాంగ్వేజ్ టెక్నాలజీకి చెందిన ఇద్దరు నిపుణులు భారతిని పరిశీలించారు. అనంతరం కేంద్రప్రభుత్వానికి పంపించాం. ప్రొవిజనల్ పేటెంట్ వచ్చింది. పూర్తిస్థాయి పేటెంట్ కూడా వస్తుందని ఆశిస్తున్నాను. ప్రభుత్వం కూడా భాషాభివృద్ధి కోసం చేపట్టే వినూత్న ప్రయోగాలను ప్రోత్సహిస్తోంది.
    – దీనిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు?
    ప్రభుత్వం గట్టిగా తలచుకుంటేనే అమలు సాధ్యం. అప్పుడే ఈ లిపి ప్రజల్లోకి వెళ్తుంది. త్వరలోనే భారతి లిపిని ఐఐటీ మద్రాస్ వెబ్‌సైట్‌లో పెట్టబోతున్నాను. అంతేగాక విరామ సమయంలో పాఠశాలలకు వెళ్లి ఈ భాషపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తాను.
    – ఎవరికి వారు లిపిని రూపొందించుకుంటూ పోతే.. ఎలా?
    బహుశా అభిజిత్ చటర్జీ అనే సైంటిస్ట్ అనుకుంటా, ‘శివ’ అనే స్క్రిప్ట్‌ను రూపొందించారు. అది సహజంగా వుండదు. అంటే డిజిటల్‌లో ‘8’ వుంటుంది కదా! ఒక్కో లైను పోతే ఒక్కో అక్షరం మనకు కనిపిస్తుంది. అదే శివ స్క్రిప్ట్. అది కంప్యూటర్‌లో సాధ్యం. కానీ రాయడానికి కుదరదు. దానికి బయట అంతగా ఆదరణ లేకపోయింది. కాని భారతిని సులభమార్గంలో, దేశవాసులందరికీ ఉపయోగకరంగా వుండేలా రూపొందించాను. ప్రజల ఆదరణ వుంటేనే కదా, ఏదైనా సాధ్యం. ఈ లిపికి మంచి ఆదరణ వుంటుందనే భావిస్తున్నా.
    Standard
    Telugu

    ఆంగ్ల భాషలోకి అదనపు అక్షరం? 27వ స్థానం లోకి

    ఎవ్వరూ కనిపెట్టకపోతే భాష ఎలా పుడుతుందని మాయాబజార్‌లో పింగళివారు పలికిన మాటలు అందరికీ ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. పాండవులు అస్మదీయులు అని చెప్పి కౌరవులు అనగానే తసమదీయులు అంటారు లంబుజంబు. ఆ పదం భాషలో లేకపోయినప్పటికీ అది జీవితంలో భాగంగా మారిపోయింది. మధ్యయుగంలో బెనెడిక్టిన్ మాంక్స్ మత సంబంధమైన గ్రంథాలను రచించే సమయంలో ఇంగ్లీషు భాషను అభివృద్ధి చేశారు. ఇప్పుడు కొత్తగా ఇంగ్లీషు భాషలో 27 వ అక్షరం వచ్చి చేరబోతోంది. 
    ఇంగ్లీషులో అతి తరచుగా వాడే పదాలు the, be, to, of, and. వీటిలో and పదానికి ఇప్పటికే ఒక సింబల్ ఉంది. THE ని మాత్రం అలాగే వాడుతున్నాం. దాన్ని కూడా చిన్నదిగా వాడితే ఎలా ఉంటుందా అనే ఆలోచన పౌల్ మ్యాథిస్ అనే రెస్టారెంట్ ఓనర్ మెదడులో మెదిలింది. the కి బదులుగా ఈ పక్కన చూపిన ఆకారంలో అక్షరాన్ని డిజైన్ చేసి విడుదల చేశారు. theకి బదులుగా దీనిని ఉపయోగించడం వల్ల తక్కువ సమయంలో టైపింగ్ చేయవచ్చుననేది ఆయన ఉద్దేశ్యం. ఈ అక్షరాన్ని టైప్ చేయడం అతి తేలికవుతుందని పౌల్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాలో 20 కి పైగా రెస్టారెంట్లు తెరిచిన మ్యాథిస్ పౌల్ మూడు దశాబ్దాలుగా తన వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతూ, ‘మిస్టర్ మిడాస్’ గా ప్రఖ్యాతి పొందారు. కేవలం మెల్‌బోర్న్‌లో ఆరు రెస్టారెంట్లు నడుపుతున్నారు. ఆయన బిబిసికి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘నేను ఈ అక్షరాన్ని ఆప్స్‌లో చేర్చమని ఆపిల్ కంపెనీని అడిగాను. అందుకు వారు నిరాకరించారు. వారి ఆలోచనను మార్చగలనన్న నమ్మకం నాకుంది’’ తన మనసులోని భావాలను వ్యక్తపరిచారు.
    ‘‘ఈ మార్పు అవసరమా’ అని ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకి ‘‘అవసరం లేదు’’ అన్నారు. ‘‘ఈ అక్షరం ప్రపంచంలో ఏదైనా మార్పు తీసుకువస్తుందా’’ అని ప్రశ్నిస్తే ‘‘అటువంటిదేం లేదు. కాని ప్రజలందరికీ ఇది ఉపయోగకరంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. ట్విటర్‌లో కాని, స్విప్ట్ టైపింగ్‌లో కాని the బదులుగా దీనిని టైప్ చేయడం వల్ల పని సులువవుతుందని నేను భావిస్తున్నాను. అతి ఎక్కువగా ఉపయోగించే and పదానికి ఇంగ్లీషులో ఇప్పటికే ఒక సింబల్ ఉండటం వల్ల ఆ పదాన్ని అతి తేలికగా వాడగలుగుతున్నాం. అదేవిధంగా theకి కూడా ఉంటే ఆ అక్షరాన్ని తేలికగా రాయగలమా? లేదా? ఒక్కసారి ఆలోచించండి. నేను the అనే పదాన్ని మార్పు చేయట్లేదు. కేవలం అక్షరంగా మాత్రమే చేస్తున్నాను. 500 సంవత్సరాల తర్వాతైనా ఈ అక్షరాన్ని వాడనందుకు ప్రజలు ఆశ్చర్యపడకపోరు’’ అని పౌల్ అన్నారు.

    – డాక్టర్ వైజయంతి –

    ఆధారం : సాక్షీ దినపత్రిక

    Standard
    Telugu

    ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కొన్ని నిలిచిపోయే జ్ఞాపకాలు

    ‘‘నా కనులందు వెన్నె లలు
    నర్తన మేమిటి చేసి పోయెనో
    నాకపురీ విలాసినుల నాణెపు కాంతి
    శరీర శోభతో’’…


    ఈ పద్యం అనుభూతి పరాకాష్ఠ. కవిలో కవి పనిముట్టులో ఏ తాత్విక నేత్రం ఏమి దర్శిస్తుందో, అది భాషకు-అనుభూతికి మధ్య జరిపే సంగ్రామం; అదే కవిత్వం. విశ్వసృష్టి మనిషి తర్కానికి ప్రతిబింబం కాదు. కవి భావనామయ సందర్భానికి దాని అవసరాలనుబట్టి సాగిస్తున్న నిర్మాణం ఎలా కవిత్వమైపోతుందో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ పరిచయం చేయగలరు.

    సాహితీ ప్రపంచంలో సుపరిచితులైన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు. కవి పండిత కుటుంబంలో, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి తనయులుగా 1944లో తూ.గో జిల్లాలో జన్మించారు, దాదాపు అన్ని సాహితీ ప్రక్రియలనూ స్పృశించినట్టే కనపడతారు. అపురూపమైన భావావేశం వీరి సొంతం. ఆవేశాన్నైనా, ఆవేదననైనా అక్షరాల్లో లయబద్దంగా అమర్చగల్గడం, పాఠకుల మనసులతో పాటు, మెదళ్ళనీ రచనల ద్వారా కదిలించగలగడం వీరి ప్రత్యేకతలు. వీరి సతీమణి ఇంద్రగంటి జానకీబాల గారూ రచయితగా సుప్రసిద్ధులే. రేడియో వినే అలవాటు ఉన్న వారందరికీ, “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ..” అంటూ ఆమె గొంతులో ఆహ్లాదంగా సాగిపోయిన గీతం ఈ పాటికే గుర్తొచ్చి ఉంటుంది.

    ఇంద్రగంటి మోహన కృష్ణ సినీ దర్శకులు

    తనయులు ఇంద్రగంటి మోహన కృష్ణ( తెలుగు సినిమా దర్శకులు మొహనకృష్ణ గారి సారధ్యంలో 2004 ఎన్నో అవార్డులు పొందిన వీరి మొదటి సినిమా గ్రహణం, 2006 లో వచ్చిన మాయాబజార్ ,2008 లో అల్లరి చేసిన అష్టాచెమ్మా 2011 క్రికెట్ ఆడిన గోల్కొండ హైస్కూల్ గుర్తుండే వుంటాయి.

    విజయవాడ రేడియో స్టేషన్‌ శ్రోతలందరికీ అప్పటికీ, ఇప్పటికీ గుర్తుండి పోయిన తిరునాళ్ళకు తరలొచ్చే కన్నె పిల్లలా పాట ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు రాసిందే పాట గురించి కొన్ని మాటలు. …………..
    1982-83 ప్రాంతాల్లో ఆయన విజయవాడ వస్తే రేడియో కేంద్రం వాళ్ళు ఆయన చేత ఒక పాటను (తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా …) చేయించుకున్నారు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి రచనకు
    విజయరాఘవరావుగారు బాణీ కడితే,
    పద్మశ్రీ, శ్రీరంగం గోపాలరత్నం  గొప్పగా పాడారు.

    తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా (2)
    మెరుపులతో మెరిసింది వానకారు.

    నీలిమొయిలు వాలుజడకు చినుకే చేమంతి
    కట్టుకున్న పచ్చదనం పట్టు పరికిణీ (తిరునాళ్ళకు)

    తెలివెన్నెల వేకువలో తానమాడి
    అడవిదారి మలుపుల్లో అదరిచూసి
    కొండతిరిగి కోనతిరిగి గుసగుసలాడి.
    తరగల మువ్వల గలగల నాట్యమాడి. (తిరునాళ్ళకు)

    చిగురేసిన చిరుకొమ్మలు ఊగిఊగి పోతే
    చిలిపిగ జడివానవేళ చక్కిలిగిలి పెట్టి
    పకపక పువ్వుల నవ్వులు నవ్విస్తూ వస్తూ
    బాటవెంట సంబరాలు పంచిపంచి పెడుతూ (తిరునాళ్ళకు)

    కొంటెకుర్ర కారు వెనక జంటనడక నడిచి
    విరహంతో వేదనతో వారి మనసు కలచి
    అంతలోన మంచి కలలు కనుల చిలకరించి
    జరిగి జరిగి దౌదౌవ్వుల పిలిచి పిలిచి నిలిచి. (తిరునాళ్ళకు)

    రామం గారు (S.B శ్రీరామమూర్తి) ఆ పాట పుట్టుక మీద “ఒక పాట పుట్టింది” పేరుతో డాక్యుమెంటరీ చేసారు.

    ఈ పాటను దీని గురించి వివరాలను క్రింది లింకులో చూడొచ్చు. జ్ఞాపకం లాంటి ఈ పాట వినొచ్చు
    http://www.eemaata.com/em/issues/201201/1903.html

    ► తెలుగు పొట్టి కథలకు “కథానిక” అనే అద్భుతమైన పేరు సూచించి, ఆ సాహితీ ప్రక్రియకు ఒక సమున్నత స్థానాన్ని కల్పించిన శ్రీ. హనుమచ్ఛాస్త్రి   గారి వారసత్వాన్ని నిలబెట్టడంతో పాటు, అర్థవంతమైన రచనలెన్నో చేసి, సాహితీ ప్రియులకు షడ్రసోపేతమైన విందునిచ్చిన శ్రీకాంత శర్మ గారి వంటి మహనీయులను, అప్పుడప్పుడూ కవిత్వపు సాయంత్రాల మిషతో తలచుకోవడం, కలుసు కోవడం సాహీతీ కుటుంబాలకు ఒక మరపు రాని జ్ఞాపకమే.

    1982 లో కృష్ణావతారం సినిమా కోసం రాసిన పాట ‘‘ చిన్నారి నవ్వు చిట్టి తామర పువ్వు ’’ కెవి మహదేవన్ సంగీత సారద్యంలో చేసారు.

    1983 లో నెలవంక చిత్రానికి గాను రెండు పాటలను రమేశ్ నాయుడు సంగీతంలో రాసారు అవి
    ‘‘ కనుబొమ్మల పల్లకిలోన ’’  రెండోది ‘‘ సొగసరి బొమ్మ… కోయిలాలో.. ఎగిసి ఎగిసి పడకే కోయిలాలో ..’’

    1984 లో రావుగోపాల రావు చిత్రానికి రమేశ్ నాయుడు గారి సంగీతంలోనే రాసిన ‘‘ కులుకులమ్మ చూసిందిరో ఓర ఓర చూపు… సొగసులమ్మ నవ్విందిరో దోర దోర నవ్వు ’’ అంటూ అల్లరిగా కొంచెం కథానాయకిని పొగుడుతూ మృదువుగా సాగుతుంది ఈ పాట.

    Standard
    సమాచారం

    మీరు వాడుతున్న మెడిసిన్ ఒరిజినలా లేక డూప్లికేటా తెలుసుకోవటం ఎలా ?

    డాక్టరు రాసివ్వంగానే మందులు కొనుక్కొచ్చేస్తున్నాం, ఒక్కోసారి డాక్టరు ప్రిస్క్రప్షన్ లేకుండా కూడా కొన్ని మందులు వాడేస్తుంటాం. వాడే మందులు అసలీవీ నకిలీవో తెలుసుకునేందుకు మూడు సులభమైన పద్దతులున్నాయి.

    This drug authentication service to test medicine is provided by PharmaSecure, a global innovator in drug authentication technologies and software. It provides three ways to check the authentication of specific, quality drugs:

    1) http://www.verifymymedicine.com/ వెబ్ సైట్లో మందుల పెట్టెపై నున్న అథెంటికేషన్ కోడ్ ని ఎంటర్ చేసి మందు తాలూకు వివరాలు కనుక్కోవచ్చు.

    2) SMS ద్వారా : అదే అథెంటికేషన్ కోడ్ ( ఆల్పాన్యుమరిక్ గా వుంటుంది) 9901099010 నంబరుకు sms చెస్తే, కొద్దిసేపట్లోనే మీ మెడిసిన్ అసలైనదైతే దాని తాలూకూ బాచ్ నంబరు, ఫార్మాకంపనీ పేరు వస్తాయి. మన దగ్గర వున్న ఆ వివరాలతో వాటిని సరిచూసుకోవాలి అవి ఒకేలా వున్నాయంటే మనం కొన్న మందు సరైనదే అని అర్ధం. ఈ కోడ్ 8 నుంచి 10 డిజిట్లను కలిగి వుంటుంది. over-the-counter (OTC) medicines విషయంలో ఈ పరిక్షబాగా ఉపయోగపడుతుంది.

    3) +91 9901099010 నంబరుకు సరాసరి కాల్ చెయ్యటం ద్వారా కూడా ఈ విషయాన్ని ధృవీకరించుకోవచ్చు. ఫార్మా సెక్యూర్ ఏజంట్ ఈ నంబరులో మీతో సరాసరి కావలసిన వివరాలు అందిస్తారు.
    సమయం.
    సోమవారం నుండి శుక్రవారం వరకూ : 7am – 11pm
    శని ఆది వారాలలో : 9am – 6pm

    ఇది భూటకపు ప్రచారం కాదు నిర్దారింపబడిన నిజమే అనేది ఇక్కడ కూడా పరిశీలించ వచ్చు (http://www.hoaxorfact.com/Health/drug-authentication-check.html )

    Standard
    Technical

    జిమొయిల్ రిమోట్ లాగ్ అవుట్

    ఆఫీసులోనో, మిత్రుల ఫోన్లలోనో మీరు జిమెయిల్ లాగ్ ఇన్ అయ్యి అలాగే మర్చిపోయారా. ఇప్పుడు అసలు ఏయో అకౌంట్లలో లాగిన్ అయ్యారో తెలుసుకుని వాటినుంచి లాగ్ అవుట్ అవ్వాలనుకుంటుంన్నారా ?
    దానికీ ఓ పద్దతి వుంది చూడండి.

    1. gmail అడుగు భాగంలో Last account activity అని వున్న దగ్గర Details అని వుంటుంది దానిపై క్లిక్ చెయ్యండి.
    2. మీకు పిక్చర్ లో చూపినట్లు పూర్తివివరాలు వస్తాయి.
    3. మొత్తం అన్ని సెషన్ల నుండి వెంటనే లాగ్ అవుట్ కావచ్చు.

    ఏదైనా అనుమానాస్పదంగా వేరే ip ల నుండి లాగిన్ అయ్యినట్లు అనిపిస్తే వెంటనే పాస్ వర్డ్ మార్చటం లాంటి రక్షణ చర్చలు చేపట్టవచ్చు

    Standard